
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 14 :
ప్రముఖ శైవక్షేత్రం లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న అతిథి వసతి గృహ నిర్మాణమునకు ఒక లక్ష రూపాయలు శనివారం భక్తులు విరాళంగా సమర్పించినట్లు ఆలయ ఈవో యం.రామక్రిష్ణ తెలిపారు. నంద్యాల నూనెపల్లెకు చెందిన కే. చంద్రమోళి, నాగలక్ష్మి దంపతులకు శ్రీ స్వామివారు ఇంటి ఇలవేల్పు కావడంతో మొక్కుబడిగా 1 లక్ష విరాళంగా సమర్పించారు. వారికి ఆలయ మర్యాదతో అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి, శాలువాలు, పూలమాలలు, శేషవస్త్రంతో ఘనంగా సత్కరించి, కంకణ ధారణ, ప్రసాదము, స్వామివారి చిత్రపటమును అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, ప్రధాన అర్చకులు సురేష్ శర్మ, నారాయణ శర్మ, ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు, దాతల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
