


సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 06 :
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ ఆదేశాలమేరకు నంద్యాల పోలీస్ సైబర్ సెక్యూరిటీ విభాగం ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది మరియు నంద్యాల 3 టౌన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ కళాశాల ఆడిటోరియం నందు నంద్యాల సబ్ డివిజన్ లోని జి.యం.ఎస్.కె / డబ్ల్యూ.యం.ఎస్.కె. లకు సైబర్ భద్రత, సైబర్ నేరాల నియంత్రణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సంధర్భంగా నంద్యాల పోలీస్ సైబర్ సెక్యూరిటీ విభాగం ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, 3 టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మాట్లడుతూ మీ మొబైల్స్ ఫోన్ లలో ఏ కొత్త లింక్ మరియు ఏపికె ఫైల్ వచ్చిన క్లిక్ చేయవద్దు. సైబర్ నేరాల నియంత్రణకు ముందుగా వ్యక్తిగత నియంత్రణ అవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కొరకు ఉపయోగించాలి. మీ యొక్క వ్యక్తిగత సమాచారం పంచుకోరాదు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా నంబర్లు,ఓటిపి, పాస్వర్డ్స్,వ్యక్తిగత ఫోటోలు తదితర విషయాలను ఇతరులతో చెప్పకపోవడం మంచిదన్నారు. ప్రత్యేకమైన సందర్భాలను పండుగలను దృష్టిలో పెట్టుకొని ప్రీ గిఫ్ట్ అంటూ మెసేజ్ లు వచ్చినప్పుడు స్పందించరాదు. మీ వాట్స్ యాప్ లకు తెలియని నంబర్ ల ద్వారా కాల్స్ మరియు మెసేజ్ లు, లింక్ లు వచ్చినపుడు అప్రమత్తతో వ్యవహరించండి. మోసపూరిత లోన్ యాప్ ల గురించి,మోసపూరిత ఉధ్యోగ ప్రకటనలు మొదలగు వాటిపై అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా కాల్ చేసి మీకు లోన్ శాంక్షన్ అయింది లోన్ అమౌంట్ పొందాలి అంటే కొన్ని రకాల ఫీజు చెల్లించాలి అంటే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు గ్రహించాలన్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 అనే నంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. పై సమాచారాన్ని మీ గ్రామ మరియు వార్డులలోని ప్రజలకు తెలియజేసి ప్రజలను సైబర్ నేరాల బారిన పడకుండా చైతన్యవంతం చేయాలని, అలాగే మీరు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
గమనిక : ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే పోలీసులను ఆశ్రయించలేని వారు మీ గ్రామ మరియు వార్డు నందు గల మహిళా పోలీసులను(జి.యం.ఎస్.కె / డబ్ల్యూ.యం.ఎస్.కె.)సంప్రదించి వారి సహాయం పొందవచ్చు. ఈ అవగాహన కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లతో పాటు సైబర్ క్రైమ్ టీం సభ్యులు శ్రీనివాసులు, ఈశ్వర్ సోషల్ మీడియా టీం సభ్యులు అమీర్ సబీనా తదితరులు పాల్గొన్నారు.
