

36 మంది సురక్షితం..ముగ్గురు మృతి పలువురికి గాయాలు
సంఘటనా స్థలాన్ని పరిశీలించి,సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS
ప్రమాద ఘటనపై దర్యాప్తు వేగవంతం….క్షతగాత్రులను పరామర్శించిన జిల్లా ఎస్పీ
సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 22 :
ఆళ్లగడ్డ నంద్యాల జాతీయ రహదారిలో శిరివెళ్ల సమీపంలో నెల్లూరు నుండి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు శిరివెళ్లమెట్ట వద్ద నిన్న అర్థరాత్రి సమయంలో బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ మీదుగా దూసుకెళ్లి రోడ్డు అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని దగ్ధమైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 36 మంది సురక్షితంగా బయటపడ్డారు.పలువురు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత బస్సుకు మంటలు వ్యాపించాయి. బస్సు క్లీనర్, బస్సు అద్దాలను పగులగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS వెంటనే సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లను మరియు అంబులెన్స్లను సంఘటన స్థలానికి పంపించి తాను కూడా చేరుకొని పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అనంతరం బస్సు కిటికీలో నుంచి దూకిన కొందరు ప్రయాణికులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి క్షతగాత్రులను పరామర్శించి క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. అక్కడి ప్రయాణికులతో మాట్లాడి కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు సురక్షితంగా వారి ప్రదేశాలకు వెళ్ళుటకు తగిన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N. యుగంధర్ బాబు, ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్, శిరివెళ్ల ఇన్స్పెక్టర్ రాము,పలువురు పోలీస్ అధికారులు వారి సిబ్బంది పాల్గొన్నారు.
