

విశ్వనగర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది
సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 04 :
నంద్యాల పట్టణంలోని శ్రీరామ్ థియేటర్ పక్కన గల విశ్వనగర్ వెళ్లే దారిలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ విశ్వనగర్ ప్రాంతాన్ని సందర్శించారు.17వ వార్డు విశ్వనగర్ టీడీపీ ఇన్ఛార్జ్ రామ్ మద్దయ్య ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఫిరోజ్ గారికి భారీ పూలమాలలతో ఘన స్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విశ్వనగర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, ప్రభుత్వంతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు . గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు ఇక తెరపడనుందని. ప్రజల ప్రతి సమస్యను గుర్తించి, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని తెలిపారు. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో విశ్వనగర్ ప్రజలు పాల్గొన్నారు. తమ సమస్యను గుర్తించి నిధులు మంజూరు చేయించినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
