దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల కలెక్టరేట్ ప్రాంగణంలో ఆత్మీయ కలయిక

దివ్యాంగుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 18 :

దివ్యాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణకు, మమకారానికి నేడు నంద్యాల కలెక్టరేట్ సాక్ష్యంగా నిలిచింది. ‘దివ్యాంగ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన అనంతరం, రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మంత్రి ఫరూక్ స్వయంగా దివ్యాంగుల మధ్య కూర్చుని, వారితో కలిసి భోజనం చేస్తూ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు వారికి అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. భోజన సమయంలో దివ్యాంగులు తమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకురాగా, వాటిని సానుకూలంగా విన్న ఆయన, తక్షణమే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని భరోసా ఇచ్చారు.

భోజనం అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మీ అందరితో కలిసి కూర్చుని భోజనం చేయడం నాకు ఎంతో తృప్తినిచ్చిందని . మిమ్మల్ని దివ్యాంగులుగా చూడటం లేదు, నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని అన్నారు . మీ చిరునవ్వులే మా ప్రభుత్వానికి అసలైన బలం.” అని తెలిపారు. భోజన సమయంలో మీరు నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను నేను స్వయంగా నోట్ చేసుకున్నానని . వీటన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించానని తెలిపారు . అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఇప్పటివరకు ప్రయాణం కోసం మీరు ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా మీరు ఎక్కడికైనా ఉచితంగా వెళ్లవచ్చు అని . ఇది కేవలం పథకం కాదు, మీ ఆత్మగౌరవ ప్రయాణం.” అని తెలిపారు శారీరక వైకల్యం మీ ప్రతిభకు అడ్డంకి కాకూడదని . విద్య, ఉపాధి రంగాల్లో మీరు రాణించేలా ప్రభుత్వం అన్ని రకాల మద్దతు ఇస్తుందని . మీలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే మా సంకల్పం అన్నారు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మాది సంక్షేమ పాలన అని, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే మా ధ్యేయం.” అన్నారు

మంత్రి ఫరూక్ ప్రోటోకాల్ పక్కన పెట్టి తమతో కలిసి సామాన్యుడిలా భోజనం చేయడం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఆత్మీయ భోజన కార్యక్రమంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, రజియా సుల్తానా,  దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఇతర రెవెన్యూ మరియు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top