ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు – వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 13 :

నంద్యాల జిల్లాలోని గ్యాస్ వినియోగదారులకు తెలియజేయడమేమనగా, ఆయిల్ కంపెనీల నుండి అందిన సమాచారం మేరకు డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై అదనంగా రూ.60/- మరియు కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై అదనంగా రూ.115/- పెంపు జరిగినట్లు తెలియజేయబడిందని జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నందున గ్యాస్ వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని తెలిపారు. అవసరానికి మించిన అదనపు బుకింగ్స్ చేయకుండా వినియోగదారులు సహకరించాలని కోరారు.  అలాగే, గృహ వినియోగం కోసం కేటాయించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను హోటల్స్, టిఫిన్ సెంటర్లు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు విక్రయించినట్లు తెలిసిన పక్షంలో, సంబంధిత వినియోగదారుల గ్యాస్ సబ్సిడీ నిలిపివేయడమే కాకుండా వారి గ్యాస్ కనెక్షన్ రద్దు చేయుటకు తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఇక ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత డిస్ట్రిబ్యూటర్లపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారి లైసెన్సులు కూడా రద్దు చేయబడతాయని తెలిపారు. అదేవిధంగా, గ్యాస్ డెలివరీ సమయంలో వినియోగదారులు బిల్లులో పేర్కొన్న మొత్తానికి మించి డెలివరీ బాయ్స్‌కు ఎటువంటి అదనపు చెల్లింపులు చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా డెలివరీ సిబ్బంది వినియోగదారులతో అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లులో ఉన్న మొత్తానికి మించి డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే సంబంధిత పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దారు, మండల తహశీల్దారు, జిల్లా పౌరసరఫరాల అధికారి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు ఫిర్యాదు చేయవలసిందిగా జాయింట్ కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

Scroll to Top