భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కీలక నిర్ణయాలు – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

ప్రజల సంతృప్తి పెంపే లక్ష్యంగా సమన్వయంతో కార్యాచరణ..

రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు  – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

నంద్యాల జిల్లా / జనవరి 03- 2026 / సత్యం వార్త ప్రతినిధి :

భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో భూసమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్‌తో కలిసి రెవెన్యూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, దీర్ఘకాలిక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. వివిధ రకాల భూ సమస్యల పై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను జారీ చేసిందన్నారు. ఈ విధానాల అమలులో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి బాధ్యతలను అధికారులకు కేటాయించినట్లు తెలిపారు.

భూసమస్యల పరిష్కారానికి అధికారుల వారీగా కేటాయించిన బాధ్యతలు

1)జిల్లా కలెక్టర్: నిషేధిత భూముల జాబితాలో భూములను చేర్చడం

2)జాయింట్ కలెక్టర్:

●ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్పు

●22-ఏ నిషేధిత భూముల జాబితా నుండి తొలగించిన భూముల పై ఆర్డీఓ ఉత్తర్వులపై 30 రోజులలో అప్పీల్ పరిష్కారం

3) ఆర్డీఓ (రెవెన్యూ డివిజనల్ అధికారి):

●భూ వర్గీకరణ మార్పులు

●22-ఏ నిషేధిత భూముల జాబితా నుండి భూముల తొలగింపు

●డిస్ప్యూట్ రిజిస్టర్‌లో చేర్పులు / తొలగింపులు

●రీ–సర్వే పూర్తైన గ్రామాల్లో సవరణలు

(విస్తీర్ణ సవరణలు, సర్వే రికార్డుల మార్పులు, పట్టాదారు పేరు మార్పు, భూ వర్గీకరణ మార్పులు)

4)తహశీల్దార్:

●కోర్టు ఉత్తర్వుల అమలు

●సర్వే నంబర్ల చేర్పులు, మార్పులు

●నోషనల్ ఖాతా నుండి రెగ్యులర్ ఖాతాకు మార్పు

●జీరో ఖాతా నుండి రెగ్యులర్ ఖాతాకు మార్పు

●డూప్లికేట్ సర్వే నంబర్ల తొలగింపు

ఇక భూ సమస్యల పరిష్కారానికి ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించేందుకు జిఎస్డబ్ల్యూఎస్ (GSWS) ద్వారా ఐదు కొత్త రెవెన్యూ సేవలను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్న కొత్త రెవెన్యూ సేవలు

●కోర్టు ఉత్తర్వుల ఆధారంగా మ్యుటేషన్

●2000 సంవత్సరానికి ముందు నమోదైన లావాదేవీలకు మ్యుటేషన్

●అసైన్డ్ భూముల వారసులకు (ఇతర వారసత్వంతో పాటు) మ్యుటేషన్

●తప్పిపోయిన / నకిలీ సర్వే నంబర్లను చేర్చడం లేదా తొలగించడం

●ఒక పట్టాదారుడికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్న చోట ఖాతాల తొలగింపు, అలాగే మరణించిన వ్యక్తుల భూములను చట్టబద్ధంగా నమోదు చేసి అనవసర ఖాతాల తొలగింపు

భూసమస్యల పరిష్కారంలో ఆలస్యం లేకుండా నిర్ణీత గడువుల్లో సమస్యలు పరిష్కరించి ప్రజల్లో నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Scroll to Top