అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం చారిత్రాత్మకం: మంత్రి ఫరూక్
అమరావతి రాజధాని చట్ట బద్ధత పై హర్షం వ్యక్తం చేసిన ఐఎంఏ వైద్యులు




సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 03 :
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కి పార్లమెంటులో చట్టబద్ధత చేసిన సందర్భంగా శుక్రవారం నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. మంత్రి ఫరూక్ వైద్యులతో కలిసి కేక్ కట్ చేశారు. ఐఎంఏ వైద్యులు మంత్రి ఫరూక్ ను సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలమైన ప్రదేశంలో అమరావతి మహా నగరాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూనుకోవడం ఆయన దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ఐఎంఏ వైద్యులు అమరావతి రాజధాని విషయంలో మద్దతు పలుకుతూ హర్షం వ్యక్తం చేయడం అభినందనీయమన్నారు.
ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, బిజెపి నాయకులు డాక్టర్ ఇంటి ఆదినారాయణ, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ సునీత మాట్లాడుతూ ఏప్రిల్ 2 వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన చారిత్రాత్మక రోజుగా కలకాలం నిలిచిపోతుందని, ఆ దిశలో కృషిచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యామంత్రి నారా లోకేష్ లకు,పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, పార్లమెంటులో మద్దతు తెలిపిన రాజకీయ పక్షాలన్నిటికీ వైద్యుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ వైద్యులు డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ ఇంటి ఆదినారాయణ, డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ ,డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ పనిల్ కుమార్, మహిళా వైద్య విభాగం ప్రతినిధులు డాక్టర్ సునీత, డాక్టర్ హరిత, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ లలిత, డాక్టర్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
