


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 21 :
ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం నంద్యాల కలెక్టరేట్ ఆవరణలో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి స్వయంగా పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కలెక్టరేట్ ప్రధాన ఆవరణతో పాటు పి.జి.ఆర్.ఎస్ హాల్ పరిసరాల్లో ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టారు. చెత్త, వ్యర్థ పదార్థాలను తొలగించి, ఒక చిన్న కాగితం కూడా కనపడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్, వివిధ విభాగాల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది చురుకుగా పాల్గొని పరిశుభ్రతపై తమ నిబద్ధతను చాటారు. ప్రతి ఒక్కరూ సమిష్టి బాధ్యతగా భావించి శుభ్రత కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ సమక్షంలో సిబ్బంది అందరూ “స్వచ్ఛ ఆంధ్ర” ప్రతిజ్ఞ చేశారు. పరిశుభ్రమైన కార్యాలయ వాతావరణం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని, శుభ్రతను జీవిత విధానంగా అవలంబించాల్సిన అవసరాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
