కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి శివరాత్రి ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

సత్యం వార్త / (శ్రీశైలం) నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 14

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శనివారం శ్రీశైల దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన కలెక్టర్, అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, పాతాళగంగ స్నాన ఘట్టాలు, వసతి గృహాలు, ప్రధాన రహదారులు తదితర ప్రాంతాల్లో పరిస్థితులను జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల నిర్వహణను క్రమబద్ధంగా చేపట్టాలని, ప్రతి స్లాట్‌లో దర్శనాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని సూచించారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలు, శానిటేషన్, లైటింగ్ వంటి మౌలిక వసతులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా అధికారులను అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ఫైర్ సిబ్బంది, వైద్య బృందాలు, పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు శాఖ అధికారులకు సూచిస్తూ, భక్తుల వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలాలు ఏర్పాటు చేసి, రవాణా అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం రోజున లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి తరలివస్తారని అంచనా ఉన్నందున, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Scroll to Top