మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలి

పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

బెల్ట్ షాపులను పూర్తిగా నివారించాలి

  • జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు – జిల్లా ఎస్పి సునీల్ షేరాన్

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 20 :
జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన (ఎన్‌కార్డ్) జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ సునీల్ షేరాన్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ…. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వాడకంపై జిల్లాలోని పాఠశాలల, కళాశాలల నుంచి ఏవైనా ఫిర్యాదులు వచ్చాయా అనేది పరిశీలించాలన్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో విస్తృతంగా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు బానిస కాకుండా పోలీస్ విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వాటిని వాడితే వచ్చే దుష్పరిమాణాలపై ఎక్సైజ్, సెబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ హాస్టల్లలో విద్యార్థులను గమనిస్తూ ఉండాలన్నారు. జిల్లాలో బెల్టు షాపుల నివారణకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. పాములపాడు మండలంలో బెల్ట్ షాపులు అధికంగా ఉన్నాయని వీటిని పూర్తిగా నివారించాలన్నారు. నాటు సారా తయారు చేస్తున్న చెంచుతాండాలు మారుమూల గ్రామాల ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి నాటు సారా తయారీ నుంచి వారిని పూర్తిగా విముక్తి పరచాలన్నారు. నందికొట్కూరు మండలంలోని షికారు కాలనీవాసులకు ఉపాధి అవకాశాలు కల్పించి నాటు సారా తయారీని నివారించాలన్నారు. పాఠశాలలు, కళాశాలలకు దగ్గరలో ఉన్న బ్రాందీ షాపులను ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు.

అనంతరం జిల్లా ఎస్పి సునీల్ షేరాన్ మాట్లాడుతూ….వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలను నియంత్రించేందుకు పోలీసులతో పాటు రెవెన్యూ ఇతర శాఖల అధికారులు సహకరించాలన్నారు.
జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ల పరిదిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి గంజాయి ఇతర మత్తు పదార్థాలపై దాడులు నిర్వహించి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడైతే మత్తు పదార్థాలు లభ్యమవుతున్నాయో ఆయా ప్రదేశాలను గుర్తించి తమకు తెలియజేయాలన్నారు. అన్ని విద్యాసంస్థలు కళాశాలల్లో విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని సంబంధిత కళాశాలల యాజమాన్య కమిటీలకు సూచించారు.
ఈ సమావేశంలో ఎక్సైజ్,పోలీసు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డీఈవో, ఐసిడిఎస్ బీసీ, ఎస్సీ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు, పాల్గొన్నారు.

Scroll to Top