

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 08 :
ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో, నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఆదివారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి 19 సంవత్సరాల లోపు బాల బాలికల ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, సత్యసాయి జిల్లా క్రీడా అధికారి కిషోర్ చదరంగం బోర్డ్ పై పావులు కదిలించి లాంఛనంగా టోర్నమెంట్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ మేధాశక్తిని పదును పెడుతుందన్నారు. విద్యార్థులలో ఏకాగ్రతను ఇనుమడింప చేస్తుందన్నారు. క్రీడల ద్వారా గెలుపు,ఓటములను స్వీకరించే ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు.గెలిచినవారు మళ్లీ గెలవాలని, ఓటమి చెందిన వారు నిరంతర సాధన ద్వారా భవిష్యత్తులో గెలుపు సాధించడానికి కృషి చేయాలని కోరారు.
రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలలో నంద్యాల జిల్లా తరపున పాల్గొంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, సత్యసాయి జిల్లా క్రీడా అధికారి కిషోర్, సత్య సాయి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మణికంఠ రెడ్డి, జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి రాజా రమేష్ చక్రవర్తి, కోశాధికారి శ్రీనిష్ ,క్రీడాకారులు వారి శిక్షకులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.
