వైయస్సార్ నగర్లో తీవ్ర ఆందోళన


సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 24 :
నంద్యాల పట్టణంలోని వైయస్సార్ నగర్ బుడగజంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఓ వివాహంలో మిగిలిపోయిన భోజనం తీసుకుని తిన్న వారిలో పలువురికి అస్వస్థత కలిగినట్లు సమాచారం. స్థానికుల సమాచారం ప్రకారం 60 నుంచి 80 మంది వరకు ఫుడ్ పాయిజన్కు గురైనట్లు తెలుస్తోంది. బాధితులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు ఇంటి వద్దే వైద్యం తీసుకుంటున్నారు.
మున్సిపల్ కమిషనర్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, ఎమ్మార్వో, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆసుపత్రులను సందర్శించిన అధికారులు బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్కు గల కారణాలపై విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రాంతంలో పరిశుభ్రత చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – పాత భోజనం తీసుకోవద్దు.
