
సత్యం వార్త / నంద్యాల /జనవరి 7 : నంద్యాల మండలం కొత్తపల్లి,బిల్లలా పురం గ్రామాల్లో పొలం పని కార్యక్రమాన్ని నిర్వహించినట్టు మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం రబీలో సాగులో ఉన్న జొన్న , వరి , మినుము పంటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడమైనది.అలాగే మినుము పంట సాగు లో చేపట్టవలసిన సమగ్ర సస్య రక్షణ చర్యల గురించి వివరించడం జరిగింది.అలాగే రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి పంటలు సాగు చేయాలని ఇందుకు గాను రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని సూచించారు. అధిక ఎరువుల వాడకం వలన భూమి చౌడుబారి భూసారం తగ్గుతుందని , తద్వారా పంటల దిగుబడిపై ప్రభావం చూపుతుందని తెలిపారు. కావున రైతులు నానో జీవసంబంధమైన ఎరువులను పంటల సాగులో ఉపయోగించడం అలవర్చుకోవాలని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరించి పంటలు సాగు చేయాలని , దీని వలన నాణ్యమైన దిగుబడులు పొందటమే కాకుండా, అధిక మార్కెట్ ధర పొందగలరని తెలిపారు. అలాగే రైతులు సాగు చేసిన పంటలను ఈ పంటలో నమోదు చేయించుకోవాలని, అందుకుగాను సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు బాలలింగామయ్య, రైతు సేవా కేంద్రం సిబ్బంది సురేష్, శివ నాయక్ , రైతులు పాల్గొన్నారు.
